Showing posts with label బ్లాగు విషయం. Show all posts
Showing posts with label బ్లాగు విషయం. Show all posts

ఈత - నా మొదటి అనుభవం.

నేను మొదటి సారి ఈత కొట్టింది అనంతపురం జిల్లా, పామిడికి దగ్గరలో ఉన్న 'నాగసముద్రం' అనే గ్రామంలో. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే మా జిల్లాలో చెఱువులు, సముద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి:-) అవి వేసవి సెలవలు, మూడు లేదా నాలుగో తరగతిలో ఉన్నాననుకుంటా అప్పుడు. ముందే చెప్పినట్టు ప్రతి వేసవి సెలవలకు మా చిన్నమామ ఉద్యోగరీత్యా ఏ ఊర్లో ఉంటాడో ఆ ఊరికెళ్లడం నాకలవాటు. ఆ సంవత్సరం నాగసముద్రంలో ఉన్నాడు.

నాగసముద్రం చాలా చిన్న పల్లె. అంతా కలిపి ఓ వంద గడపలు, కనుచూపు మేరా పొలాలు, ఊరికి దూరంగా కొన్ని వ్యవసాయ బావులు. ఒకట్రెండు రోజుల్లోనే ఓ చిన్న పిల్లగుంపు తయారు చేసుకొని ప్రతి రోజూ ఉదయం నుండి చెట్లంబడి, పుట్లెంబడి తిరుగుతూ, ఈత చెట్లకు విరగకాసిన ఈతపండ్లు రాళ్లతో కొట్టి, రాలిపడినన్నిమూటకట్టి, ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. అలా ఓ రోజు ఆడుకొంటున్నప్పుడు ఆకస్మాత్తుగా ఈత ప్రపోజల్ పెట్టాడు ఓ మిత్రుడు. నాకేమో ఈత రాదాయె! మా గుంపులో దాదాపుగా అందరికీ ఈత కొట్టడం వచ్చు. సరే, అని ఇంటికెళ్లి 'మునగబెండ్లు' తీసుకొని బావి దారి పట్టాం అందరం.

మొదటిసారి పై నుంచి ఆ దిగుడుబావిని చూడగానే వెన్నులో నుంచి ఒణుకు పుట్టింది. చెడ్డీ తప్ప మిగిలినవన్నీ పక్కన పెట్టించి నడుముకు మునగబెండ్లు నారతాడుతో కట్టడం మొదలుపెట్టారు స్నేహితులు. ఒక్కొక్కొరుగా బావి లోనికి పొడవుగా సాగి ఉన్న బండ (పై చిత్రంలోలా) మీద నుంచి దూకసాగారు. నా వెనుక ఉన్న మిత్రుడు ధైర్యం చెబుతూ 'చింతూ, భయపడొద్దు! కళ్లు మూసుకొని దుంకు" అన్నాడు. నాకేమో కాళ్లు వణుకుతున్నాయి. బావి మెట్లు దిగి నీళ్లలోకి దిగితానని మంకు పట్టు పట్టాను. ఇలా కాదని ఒక్కతోపు తోసాడు. "ఛల్ల్"మని చల్లటి నీళ్లు నా ముఖానికి గట్టిగా తగిలాయి. ఒళ్లంతా ఒక్కసారి జలదరించింది. ఎక్కడో లోపలికి, పాతాళం లోనికి వెళ్లిపోతున్నట్టు అనిపించింది. నోట్లోంచి నీటిబుడగలు. విపరీతమైన భయానికి గురయ్యాను. ఇంట్లో అందరినీ తలచుకొంటున్నాను... అవే నా ఆఖరి క్షణాలయినట్టు. అలా కొన్ని క్షణాలు గడిచాక, అవి నాకు యుగాల్లా అనిపించాయి, ఎవరో నా జుత్తు పట్టుకొని పైకి లాగారు.

గాలి కోసం ఎగశ్వాస పీలుస్తున్నాను. ముగ్గురు కలిసి గట్టిగా పట్టుకొని, లాక్కొచ్చి ఒడ్డున పడేశారు. కడుపులో కొన్ని నీళ్లు వెళ్లాయి, కానీ ఇంకా స్పృహలోనే ఉన్నాను. అసలేం జరిగిందంటే, సరిగ్గా బిగించడంలో లోపమో, లేక రాపిడికి తెగిపోయాయో, మొత్తానికి నా 'మునగబెండ్లు' ఊడిపోయాయి. పైన ఆటలాడుకొంటున్న వారికి అవి అలా తేలుతూ కనిపించడంతో వెంటనే దూకడంతో నేను బ్రతికి బయటపడ్డాను. అసలు అంత ఎత్తు నుంచి దూకితే ఒక్కసారి లోనికెళ్లి మళ్లీ వెంటనే పైకి తేలి మళ్లీ లోనికెళతాము. నాకైతే పైకొచ్చిన జ్ఞాపకమే లేదు. అలా నా జలగండం గడిచింది. ఇంట్లో చెబితే తంతారని అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఊరకుండిపోయారు. ఇది నా మొదటి 'ఈతా'నుభవం:-(

ఇక్కడ అప్రస్తుతమైనా, నాగసముద్రంలో సాయంకాలాలు ఏం చేసే వాళ్లమో అదీ చెబుతా. చెనిక్కాయలు(వేరుశెనగ) అనంతపురంలో విస్తారంగా పండే పంట(వానదేవుడు కరుణిస్తే!). అలా ఆ పల్లెలో విత్తనాల కోసం మూటలు మూటలు కాయలు ఒలిచేవారు. శేరు విత్తనాలు, కాయలు కాదు, ఒలిస్తే 'పావలా'(25 పై.) ఇచ్చేవారు. ఇంటి వసారాలో గుట్టలు గుట్టలుగా చెనిక్కాయలు వేసుకొని ఒలుస్తున్న పెద్దల చుట్టూ పిల్లాజెల్లా అంతా చేరి, వారి మాటలు ఆసక్తిగా వింటూ, ఒక్కోసారి ఓ పెద్దమ్మ చెప్పే కథలు వింటూ మేమూ ఒలిచేవాళ్లం. ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు రావు, ఒకామె రెండు చేతులు, రెండు కాళ్లూ ఏకకాలంలో ఉపయోగిస్తూ చెనిక్కాయలను చీల్చిచెండాడేది. నేను రోజంతా కష్టపడితే ఏ పావుశేరో ఒలిచేవాణ్ణి. ఇక మా అమ్మ దగ్గరో, మా అవ్వ దగ్గరో కాసిన్ని దోసిట్లో వేసుకొని,శేరు పూర్తిచేసి ఆ 'పావలా' సంపాదించేవాన్ని.

ఇక ఆ పావలాతో ఏం చేసేవాన్నంటే...ఆ పల్లెలో అప్పుడే కొత్తగా టి.వి./వి.సి.ఆర్. వచ్చాయి. ఓ బుద్ధిమంతుడు, చిన్న గదిలో వాటిని పెట్టి, ఓ చెక్కతో అ గదిని రెండు భాగాలుగా విభజించి ,అందులో ఓ పక్క బల్లలు వేసి, చిన్న వీడియో థియేటర్ నడిపేవాడు. టి.వి. దగ్గరగా అయితే నేల టికెట్టు-వెల: పావలా, బల్ల అయితే బాల్కని-వెల: అర్ధ రూపాయి. దానికి ఊరంతా బండిలో ప్రచారమూనూ! అందుకే ఈ 'పావలా' కష్టాలు. రాత్రి తొమ్మిది కాగానే మెల్లగా ఇంటి నుంచి జారుకొని ఆ థియేటర్ చేరేవాళ్లం. ఆ పావలాతో నేల టికెట్టు కొని, టి.వి. దగ్గరగా ముఖం ఆనించి, సినిమా చూస్తుంటే...నా సామిరంగా! ఆ ఆనందమే, ఆనందం. ఆ తర్వాతెప్పుడో ఐమాక్స్లో 'మాట్రిక్స్' చూసినా, ఆ ఆనందం ముందు అది దిగదుడుపే. అలా ఆ వేసవి సెలవలు నెల రోజులూ, క్రమం తప్పకుండా ముఫ్ఫై సినిమాలు లాగించాను. బాగా గుర్తున్న సినిమా-ఎఎన్నార్ "బుద్ధిమంతుడు", అందులోని పాట- "టాటా.. వీడుకోలు..గుడ్`బై...ఇంక సెలవు!".

(చిత్రం: సాక్షి-హిందూపురం బ్యూరోకు నెనర్లు. అలాగే ఈ వారం బ్లాగు విషయంగా, మంచి పసందైన టాపిక్కులు ఇచ్చి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తట్టిలేపుతున్న ఒరెమూనా 'చావా' గారికి కృతజ్ఞతలతో...)

గ్రంథాలయం - నా దేవాలయం.

దేవుడి గురించి ఓ టపా మొదలు పెట్టి అది చాంతాడులా అలా సాగుతూ ఉంటే కట్టి పెట్టేసా! కానీ ఈ వారం బ్లాగు విషయం ''గ్రంథాలయం" అని తెలిసి మళ్లీ దేవుడి గురించి రాయాల్సి వచ్చింది. (చట్టబద్ధమైన హెచ్చరిక: నేనే మతానికీ చెందిన వాన్ని కాను.)

"ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను"': బైబిలు-యోహాను 1:1
"In the beginning was the Word, and the Word was with God, and the Word was God."John 1:1

(ఇక్కడ Wordను వాక్యమంటున్నారేంటీ అని మొదట అనుకొన్నా, అనువాదమెప్పుడూ అర్థాన్ని స్ఫురింపచేయాలి కానీ మక్కీకి మక్కీ(ఇది హిందీ పద ప్రయోగం:-) ఉండనవసరం లేదని తరువాత తెలిసింది.)

సరే మళ్లీ దేవుడి దగ్గరికొద్దాం...పై వాక్యంలోని 'బ్రహ్మ'రహస్యమేంటో గమనించారా? వాక్యం లేదా పదం (అంటే భాష)అనేవే లేకుంటే 'దేవుడు' అనే వాడే లేడని! అక్షరానికి, పదానికి, వాక్యానికి ఇంతకు మించిన గౌరవం ఎక్కడా నేను చూడలేదు.

అందుకే ఈ పదాలు, వాక్యాలు కలిగిన పుస్తకాలతో నిండిన విజ్ఞానభాండాగారమైన గ్రంథాలయం నా దేవాలయం అన్నది. ఒట్టి పదాలే కాదు, అంత కంటే ముఖ్యమైనది ఆ పదం మనకు చేర్చే భావం.

"But words are things, and a small drop of ink, Falling like dew, upon a thought, produces That which makes thousands, perhaps millions, think." - George Gordon Byron

ఒక మదిలో మెదిలిన ఆలోచన పదాలలో ఒదిగి మన వద్ద చేరి మనలను స్పందింపచేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకే అలా లక్షల మందిని ఆలోచింపజేసే పుస్తకాలకు నెలవైన గ్రంథాలయం నా జీవితంలో అంతర్భాగమైంది.

నాకు ఊహ తెలిసి మొదటిసారి నేను వెళ్లింది మా హిందూపురంలోని 'పురపాలక సంఘ గ్రంథాలయానికి'. ఇక అది కాక ఇంకో చిన్న గ్రంథాలయమూ ఉండేది- అది జిల్లా.గ్రం. వారి శాఖ అనుకొంటాను. అప్పట్లో పేపరు చదవడం, వారపత్రికలు చదవడంతో మొదలయ్యింది నా పఠనా వ్యాసంగం. ఇక వేసవి సెలవలకు మా చిన్నమామ(గ్రామీణ బ్యాంకు అధికారి) ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి కెళ్లే వాళ్లం. ఇక అక్కడ నాకు నచ్చే ఒకే ఒక్క ప్రదేశం ఆ ఊరి గ్రంథాలయం.

అలా ఏ నాలుగో తరగతిలో మొదలు పెట్టిన వ్యాపకం ఇప్పుడు వ్యసనమై కూర్చొంది. నేను రాయడంలో కంటే చదవడంలో ఎక్కువ ఆనందం అనుభవిస్తాను(అందుకే ఎక్కువగా బ్లాగను:-) అదీ ఇదీ అని లేదు 'చదవబుల్' అయితే చిత్తు కాగితాన్నయినా ఏరుకొని మరీ చదవి 'పారేస్తా'ను. అప్పట్లో 'సోవియట్ యూనియన్' అని మంచి నాణ్యమైన కాగితంతో, ఒత్తుగా ఉండే పుస్తకాలొచ్చేవి, (అవి ఒక్కోసారి ఉచితంగా ఇచ్చేవాళ్లు) వాటిని ఆసాంతం చదివి ఆ తర్వాత నోటు పుస్తకాలకు అట్టలుగా వేసుకొనే వాన్ని. ఆ ప్రభావంతోనే ఏమో నా గదిలో సినీ హీరోల పటాలకు బదులు 'లెనిన్' చిత్రపటం ఉండేది.(మనం చిరంజీవికి పిచ్చ ఫ్యాన్ అని మీకిప్పటికి తెలిసే ఉంటుంది:-)

ఇక యండమూరి నవలలు, శ్రీశ్రీ, చలం పుస్తకాలన్నీ అలా చదివినవే. ఏడుతరాలు(రూట్స్) నన్ను కదిలించిన మరో పుస్తకం. చెంఘీజ్ ఖాన్ లాంటి చారిత్రక నవలలుంటే ఇక పండగే పండగ. చందమామలు, బాలమిత్రలు, బుజ్జాయిలు, మధుబాబు నవలలు, మరీ ముఖ్యంగా 'ముసుగు వీరుడు' లాంటి జానపద నవలలు అన్నీ ఈ గ్రంథాలయాల్లోనే చదివాను. ఆ ప్రభావంతోనే నాకు ఒక్కసారిగా ఓ ఆరు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ గుర్రపుస్వారీలు, పూటకూళ్లమ్మ ఇల్లు, అడవిలో విశ్రమించడాలు ఇవన్నీ చేయాలని చచ్చేంత ఆశ.

ఈ బ్లాగు రాయల వారి పేర పెట్టడం వెనుక కారణం కూడా అదే, అంతే కానీ ఏ ఇతర grandiose delusions లేవు:-) ఇక ఇంటర్లో అనంతపురం వచ్చాక జిల్లా గ్రంథాలయం లో వీరవిహారం చేసేవాడిని. అక్కడ ఆంత్రోపాలజీ పుస్తకాలు, భారతదేశ, ప్రపంచ చరిత్ర పుస్తకాలు అన్నీ వేసుకొని డిగ్రీ కన్నా ముందే సివిల్సు కోసం చదవడం ఓ మధుర జ్ఞాపకం. అలా చరిత్ర పిచ్చి పట్టిందన్న మాట:-) ఇక కర్నూలులో వైద్య కళాశాలలో ప్రవేశించాక ఆ పుస్తకాల మోతలో కొన్నాళ్లు మా కళాశాల గ్రంథాలయానికే పరిమితం కావలసి వచ్చింది. అదీ ఒకటిన్నర సంవత్సరమే....ఆ తర్వాత ఛలో "గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జిల్లా గ్రంథాలయం". (రాయలసీమ అని మా సీమకు పేరు పెట్టిందితనే!)

చాలా మంది సినిమాల్లో చూసే ఉంటారు-కర్నూలులో కొండారెడ్డి బురుజుని. సరిగ్గా దాని వెనకాలే ఉంటుంది. అక్కడ మొదటి సారిగా బూజు దులిపి చదివిన గ్రంథం "తెలంగాణా సాయుధ పోరాటం" నిజాంకు వ్యతిరేకంగా సాగిన ఈ సమరంలో కళ్లు చెమర్చే సంఘటనలు ఎన్నో, మళ్లీ భారత ప్రభుత్వ సైనికుల చేతిలోను అసువులు బాసిన వారెందరో. సమయం దొరికితే చాలు నా బి.ఎస్.ఎ. ఎస్సెల్లార్ సైకిలేసుకొని కొండారెడ్డి బురుజు దాటి సర్వోత్తమరావు కోటలో సెటిలయ్యేవాన్ని.

ఇక అట్లాంటిక్ దాటి ఇక్కడికొచ్చాక మొదట ఈ దేశంలో నచ్చిన ఒకే ఒక ప్రదేశం మా కౌంటీ లైబ్రరీ. కొత్త కొత్త పుస్తకాలు ఎన్నో ఇంటికి తీసుకెళ్లి మరీ చదవొచ్చు. కానీ అక్కడ కుర్చొని చదివితే వచ్చే ఆనందం ఇంటిలో రాదు. ఇక అప్పట్లో(04') కొత్తగా కారు కొన్న రోజుల్లో అలా దారి తెన్నూ తెలియకుండా పోతూ ఉండడం (అప్పుడు నా దగ్గర జి.పి.ఎస్. లేదు మరి) ఎక్కడైనా పచ్చ రంగు గుర్తు కనపడితే అలా అక్కడ వెళ్లి ఠికానా వేయడం. అలా ఉత్తర న్యూజెర్సీలోని అన్ని కౌంటీ లైబ్రరీలు తెగ తిరిగి చివరికి మళ్లీ 'జార్జి స్మిత్ మెడికల్ లైబ్రరీ'కి పరిమితమవ్వాల్సి వచ్చింది.

ఇక్కడి రాజకీయాల గురించి లెక్కలేనన్ని పుస్తకాలు చదివాక, ఇక బయోగ్రఫీలపైన పడ్డాను. ఇందిరాగాంధీ గురించి ఇక్కడ చదివిన పుస్తకాలలో ఎన్నో కొత్త సంగతులు బయటపడ్డాయి. ఒక కాలంలో అమెరికా పంపే గోధుమ గింజలపైన మన భారతావని ఆధారపడి ఉందని తెలిస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అనిపించిందో! అవి బూచిగా చూపి 72'యుద్ధంలోఇందిర/ఇండియా మెడలు వంచాలని చూసినా ఆ పప్పులేమీ ఉడకలేదనుకోండి.ఇందిర అంటే ఓ దెయ్యంలా ఊహించుకొనే వాడిని (నేను ఎన్టీవోడికీ పిచ్చ ఫ్యానే:-) అది ఈనాడు ప్రభావమని ఇప్పుడు అర్థమయ్యింది. కానీ తను అప్పుడు అంతర్జాతీయంగా ఎదుర్కొన్న సవాళ్లు తన ధీరోధాత్తతను తెలిపాయి. ఒక మనిషి ఒకే పార్శ్వాన్ని చూపే ఏ పత్రిక మంచిది కాదని నా అభిప్రాయం.

ఇక అలా అలా పూర్తిగా ఆంగ్లంలో పడి మునిగి తేలాక , తెలుగు కోసం తపించిపోతున్నప్పడు ఒక్కసారిగా నాలుగు చందమామల దర్శనమయ్యింది. అప్పటి నుంచి తెలుగు బ్లాగులు చదవటం తరువాత నేనూ ఒకటి మొదలుపెట్టడం జరిగింది(అన్నట్టు మొన్నామధ్యే నా బ్లాగుకు రెండేళ్లు పూర్తి అయ్యాయోచ్!) మొదట కాస్త నత్తనడక నడిచినా, తరువాత మందగమనాన్ని, ఇప్పుడు వాయువేగాన్ని అందుకొన్నాయి తెలుగు బ్లాగులు. ఇక ఇప్పుడు సమయమంతా కూడలికే అంకితం.

చివరిగా ఓ మాట...ఈ అంతర్జాలమొచ్చాక ప్రపంచంలోని గ్రంథాలయాలన్నీ మీ ముంగిట వాలినా, గ్రంథాలయానికి వెళ్లి ఓ పుస్తకం దుమ్ముదులిపి ప్రశాంతంగా అలా పేజీలు తిరగేస్తూ చదివే అనుభూతి ఎన్ని గూగుల్ పుస్తకాలు, డిజిటల్ మాగజైన్లు చదివినా రాదు. గుడికి వెళ్లి ఆ ప్రశాంత వాతావరణంలో చేసే పూజకు, నెట్లో ఎదో ఒక సైటు నొక్కి చేసే డిజిటల్ పూజకు ఎంత తేడా ఉందో గ్రంథాలయంలో అసలు సిసలు పుస్తకాన్ని తీసి చదవడానికీ, అంతర్జాలంలో డిజిటల్ పుస్తకం చదవడానికీ అంత తేడా ఉంది.

కొసమెఱుపు: కాస్త పక్కకు చూస్తే కొత్తగా ఏర్పాటు చేసిన నా 'డిజిటల్' లైబ్రరీ కనిపిస్తుంది, షెల్ఫారీ వారి సౌజన్యంతో....కానీ ఈ పుస్తకాలన్నీ అలా పేజీలు తిప్పేస్తూ, కొత్తపేజీల వాసన చూస్తూ చదివినవే సుమా!