తెలుగు ముత్యం - సీమ మట్టిలో మాణిక్యం!

'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు' అంటారు. నిజమే..! కృషి, పట్టుదలతో- రేవు ముత్యాలరాజు నిజంగా ఓ మహాద్భుతాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ఆణిముత్యం 2006 సివిల్‌సర్వీసెస్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం దీవి గ్రామంలో మత్స్యకారుల కుటుంబంలో జన్మించిన ముత్యాలరాజు నేడు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు(1971లో రాష్ట్రానికి చెందిన దువ్వూరి సుబ్బారావు ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి).

డబ్బు ముఖ్యం కాదు: చిన్నప్పటి నుంచీ నేను చదువుల్లో టాప్‌. ఇంజినీరింగ్‌ చేసిన తర్వాత ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ ప్రవేశ పరీక్షలో మొదటిర్యాంకు సాధించా. రైల్వే సర్వీస్‌లో ఉద్యోగంలో చేరా. నాకు ఉన్న విద్యా నేపథ్యానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కార్పొరేట్‌ సంస్థలో అయినా అత్యున్నత వేతనం అందుకోవచ్చు. కాని నాకు డబ్బు ముఖ్యం కాదు. గ్రామీణ ప్రాతాంలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే సివిల్స్‌కు హాజరయ్యా.

సాకులు వెతకొద్దు: అనుకున్నది సాధించకపోతే ఏదో ఒక సాకు చూపడం మానుకోవాలి. తనకంటే పై ర్యాంకులు సాధించిన వారు డబ్బుతోనో... మరో విధంగానో మేనేజ్‌ చేశారని సర్దిచెప్పుకుంటుంటారు. ఇదే పతనానికి తొలిమెట్టు. లోటుపాట్లను అంగీకరించాలి. ఒక్కక్కొక్కదాన్నే అధిగమించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే లక్ష్యం సాధించడం సాధ్యమవుతుంది
(ఈనాడు నుంచి)

అకుంఠిత దీక్ష... పట్టుసడలని ఆత్మ విశ్వాసం... లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే కులం, పేదరికం ఇవేవి విజయానికి అడ్డు రావని నిరూపించాడు రామాంజినేయులు. కక్షలు, కార్పణ్యాలు రగులుతూ... నిత్యం కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలో మట్టిలో మాణిక్యాలున్నాయని రుజువు చేశాడు. ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో రాష్ట్రం నుంచి 14వ స్థాయిలో నిలిచి తన ప్రతిభను చాటుకొన్నాడు. అనంతపురంలో గిరిజన సంక్షేమ శాఖలో సాధారణ గుమాస్తా ఉద్యోగం చేస్తున్న హనుమంతు కుమారుడు రామాంజినేయులు... బిటెక్‌ చదివాడు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు. ఇతని స్వగ్రామం పెనుకొండ మండలం అడదాకులపల్లి. ప్రస్తుతం అనంతపురంలోని కృపానందనగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి హనుమంతు తనకు ఉన్నదంతా అమ్మి చదివించగా వారి ఆశలను కొడుకు రామాంజినేయులు నెరవేర్చాడు.

నిర్థిష్టమైన లక్ష్యం ఉండాలి : నిర్థిష్టమైన లక్ష్యం ఉన్నప్పుడే అనుకున్న గమ్యానికి చేరుతామని పేర్కొన్నారు. వేసే ప్రతి అడుగు ఆలోచించాలి. అనంతపురం జెఎన్‌టియులో ఇంజనీరింగ్‌ చదివేటప్పుడే సివిల్‌సర్వీస్‌ సాధించాలని కలలు కన్నాను. అదే లక్ష్యంతో కష్టపడ్డాను. ఆంత్రోపాలజీ, జాగ్రఫీలను ఆఫ్షనల్స్‌గా ఎన్నుకున్నాను. ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యాను. ఇంటర్వ్యూకు వెళ్లటం ఇదే మొదటిసారి.

దేశాభివృద్ధికి కృషి చేస్తా 399 ర్యాంకు సాధించాను. దీనిని బట్టి ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసు వచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలను మెరుగుపడేలా కృషి చేస్తా. విదేశాలతో ప్రస్తుతం అమలవుతున్న గ్లోబలైజేషన్‌ విధానాలకు తగిన విధంగా మనదేశ రాజకీయ, ఆర్థిక, విద్య సంబంధాలను అభివృద్ధి చేయాలన్నదే తన కర్తవ్యం అన్నారు.
{'ఈనాడు' అనంతపురం నుండి}

3 comments:

రాధిక said...

రాయలవారు రాచ కార్యాలలో తలమునకలుగా వున్నరా ఏమిటి?దర్శన భాగ్యం కష్టమవుతుంది.

కొత్త పాళీ said...

ముత్యాలరాజు వంటి వారు రేపటి యువతకి స్ఫూర్తి కావాలి. మాకూ తెలియ చెప్పినందుకు డాక్టరుగారికి థాంకులు.

రానారె said...

ఈమధ్య ఇంజనీరింగు, వైద్యవిద్య ప్రవేశపరీక్షలలో తప్ప సివిల్స్‌లో ఆంధ్రులు పెద్దగా కనపడటంలేదు అనే లోటును ముత్యాలరాజు మంచిముత్యంలా మెరిసి చెరిపేశారు. ఆయన మాటలు కూడా సూటిగా నిక్కచ్చిగా ఉన్నాయి.