మన విహారి 'జ్యోతి'లో!

కొలరాడో, మార్చి 30: కొలరాడోలో జరిగిన ఉగాది వేడుకలలో పిల్లలే ప్రధాన ఆకర్షణగా నిలిచి పెద్దల అభిమానాన్ని చూరగొన్నారు. పిల్లలు ప్రత్యేకంగా ప్రదర్శించిన రామయణం నృత్యరూపకం రామయణ ఘట్టాలను కళ్ళ ముందు వుంచింది. చిట్టి పొట్టి బాల బాలికలు చేసిన ముగ్గుల పాటల నృత్యాలు, పద కవితా గోష్టులు, పంచాంగ శ్రవణాలు, నోరూరించే వంటలు, వివాహ భోజనంబు, ఘటోత్కచ ఘట్టాలు ఆహుతులను మైమరిపింప జేశాయి. ఇంకా ముద్దు ముద్దుగా తీపి పలుకులు పలికే బాలలు వల్లె వేసిన 'ఉప్పు కప్పురంబు' వంటి పద్యాలు పద్యం వచ్చిన వారిని ఆనందడోలికల్లో ముంచెత్తింది. అలాగే సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ కుమార్తె చిరంజీవి సంస్కృతి ఆలపించిన 'ఎవ్వరితో మాటలాడుకోవాలి' కూడా ప్రేక్షకులను కదలించింది.

ఇంకా కొలరాడోలో తెలుగు సంఘం నిర్వహించిన ఈ సర్వజిత్‌ ఉగాది సంబరాల్లో ప్రముఖ గాయకుడైన గజల్‌ శ్రీనివాస్‌ పాడిన తెలుగు గజల్‌ గానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దలు వీలైనంత వరకూ తమ సమయాన్ని పిల్లలతో గడపాలని తల్లిదండ్రులకు సూచిస్తూ పాడిన గజల్‌, 'పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే' అన్న మరో గజల్‌ ప్రేక్షకులను ఆకర్షించింది. విదేశాలలో వున్న తన బిడ్డను గుర్తు చేసుకుంటూ అమ్మ పాడుకునే సి.నా.రె. పాట, 'ఇంకా పొట్ట చేత పట్టుకుని' అన్న గీతం శ్రోతలను ఆకట్టుకున్నాయి.

రామారావ్‌ కలగర చేసిన మిమిక్రీ సభికులను కడుపుబ్బ నవ్వించింది. సంఘం సాంస్కృతిక కార్యదర్శి భూపతి విహారి దోనిపర్తి మాట్లాడుతూ క్రిందటి సర్వజిత్‌ నామ సంవత్సరం వచ్చినప్పుడే భారతావనికి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. డా.గజల్‌శ్రీనివాస్‌ గారికి దుశ్శాలువని కప్పి జ్ఞాపికను అందజేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసాద్‌ ఓరుగంటీ, మూర్తి గరిమెళ్ళ మరియు ఫణి కోలరాజు పాల్గొన్నారు. ఇంకా సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రకాష్‌ వరద, మోహన్‌ కోనేరు, శ్రీనివాస్‌ నల్లపాటి ప్రభతులు పాల్గొన్నారు. అత్యంత ఘనంగా చెయ్యబడ్డ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రత్యూష అప్పరసు, శ్రీనివాస్‌ వళ్ళెం వ్యవహరించారు. సంఘం అధ్యక్షుడు ధర్మ అప్పరసు తొలుత అధ్యక్షోపన్యాసం చేయడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరిస్తూ ముగిశాయి.

(ఆంధ్రజ్యోతి నుంచి)

4 comments:

రానారె said...

మంచిది. విహారిగారికి అభినందనలు. డాక్టర్‌గారూ, రామాయణంలో పిడకలవేటలాగా ఇక్కడ నాకొచ్చిన సందేహాన్ని అడుగుతున్నాను, చిత్తగించండి. "డా.గజల్‌శ్రీనివాస్‌ గారికి దుశ్శాలువని కప్పి..." అని రాశారు కదా, ఈ దుశ్శాలువ అనే పదం గురించే నా సందేహం. దుశ్శాసనుడు, దుర్యోధనుడు, దుర్మార్గుడు, దుర్భుద్ది, దుఃఖము అంటూ దుః అంటే చెడును సూచించేదిగా మనం గమనిస్తాం కదా, మరి ఆయనకు దుశ్శాలువ కాకుండా సుశ్శాలువో లేక శాలువో కప్పి సన్మానించవచ్చుకదా? ఎందుకో మీగ్గానీ తెలుసా?

Unknown said...

ఆ లెఖిని తూల్ చూసను, చాల నచ్చింది.

very useful for people like me! thanks!!

Dr.Pen said...

రామూ...నేను చదివినప్పుడు ఇదే ఆలోచన మెదిలింది. నిజమే! నేను అనుకోవడం ఇది హిందీ/సంస్కృత ప్రభావమేమో అని.దుపట్టా(హిం)/దుపట్టీ-దుప్పటి(తె)లాగా...దుశాలా(హిం)/దుశ్శాలువా(తె̲)నేమో?

ఇపనీమా ఇంతికి ఇనమసకరములు! లేఖిని కర్త వీవెన్ కు మీ కృతజ్ఞతలు చెందుతాయి.

Anonymous said...

ఇస్మాయిల్ గారూ,

మీ బ్లాగులో నా గురించి లంకె పెట్టినందుకు చాల ధన్య వాదాలండి. ఇంకో బోలెడు లంకెలున్నాయి అన్నీ త్వరలో చెబుతా.

విహారి