విశ్వ మానవుడు!

హిందూ-ముస్లిం
క్రిస్టియన్-యూదు

బ్రాహ్మణ-క్షత్రియ
వైశ్య-శూద్ర

షియా-సున్నీ
ప్రొటెస్టెంట్-క్యాథలిక్

కమ్మ-కాపు
రెడ్డి-వెలమ

ఓసీ-బీసీ
ఎస్.సీ-ఎస్.టీ

మాల-మాదిగ
సవర-చెంచు

తెలంగాణా-ఆంధ్ర
రాయలసీమ-కోస్తా

ఇండియా-పాకిస్థాను
శ్రీలంక-తమిళఈలం

అమెరికా-ఇరాక్
పాలస్తీనా-ఇజ్రాయేలు...

భాష,మతం,కులం,ప్రాంతం
ఎన్ని ప్రాణాలు బలిగొన్నాయో?

మనిషీ, మనిషీ మధ్యన
సౌహార్థము సౌరభించేదెప్పుడు?

ఆ రవీంద్రుడు కలగన్న
విశ్వమానవుడు జనించేదెప్పుడు?

-ఇస్మాయిల్ పెనుకొండ

నేనూ ఆ తానులోని ముక్కే అయినా కాస్త చిన్న ముక్క!
ఉన్నదానికంటే మెరుగైన జీవితాన్ని ఆశించడం తప్పంటారా?
ఈ కవితకు ప్రేరణ కలిగించిన అంబానాథ్(తెలుగుజాతీయవాది),
వైజాసత్య(అమెరికా నుంచి ఉత్తరం ముక్క)ల ఉత్తరాలకు కృతజ్ఞతలతో
...వాటికి నా సమాధానాలు కూడా చదవండి.

6 comments:

Anonymous said...

అలాంటి వసుధ కోసం నా ప్రాణలివ్వడానికైనా సిద్ధం.. కానీ అలా గీతాలు పాడేసుకుని కళ్లు మూసుకొని కూర్చోలేము కదండి. నెహ్రూ హిందీ..చీనీ భాయి భాయి అని కళ్లు మూసుకుని..అంతా అవే సర్దుకుంటాయని కూర్చున్నాడు ఎమయ్యింది? హిట్లర్ ఆస్ట్రియాని ఆక్రమిస్తుంటే మనకెందుకులే అని బ్రిటీషు వాళ్లు, ఫ్రెంచి వాళ్లు కళ్లుమూసుకున్నారు. ఏమయ్యింది? మహమ్మద్ ప్రవక్త మదీనాపై ఖురేష్ తెగ దండెత్తినపుడు శాంతి శాంతి అని కళ్లు మూసుకుంటే ఏమయ్యిండేది. బుద్ధుడు, యేసుక్రీస్తు, గాంధీల మార్గములో నడుస్తుంటే ప్రపంచంలో ప్రతిదేశానికి సేనలెందుకున్నాయి?
జాతి, కుల, మత, భాష బేధాలు దాటాను కానీ. ఇంకా ఈ దేశాభిమానమనే గోడను మాత్రం కూల్చలేకపోతున్నాను. అందుకేనేమో నేనింకా అసంపూర్ణమైన కథనే

రాధిక said...

caalaa mamci praardana

spandana said...

ఇస్మాయిల్ గారూ,
మీమాటలు ఎవ్వరికి నచ్చుతాయి? ఏ గుంపుమీదైనా దురభిమానం మంచిది కాదు. విచిత్రమేమంటే గుంపు చిన్నదైతే సంకుచితత్వము అనేవాళ్ళే గుంపు పెద్దదైతే భాషాభిమానం, దేశాభిమానం అని గొప్పపేర్లు పెట్టుకుని సంతోషిస్తారు. ఈ భూమిమీద పుట్టిన ప్రతిజీవికి నివసించడానికి సమానహక్కు వుందని గౌవరవించలేకున్నాం! ఒక తల్లికి పుట్టినవారే తమకు పిల్లలు పుట్టాక తాము వేరు అనుకుంటున్నకాలం!

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

నేననుకోవడమేమంటే విశ్వమానవులు అక్కడక్కడా ప్రపంచమంతటా వున్నారు. మీ మా(పా)టతో ఏకీభవించే ప్రతివాడూ విశ్వమానవుడే. కానీ బావిలోకప్పలు ప్రతిచోటా వున్నాయి. ఆ బెకబెక భరించలేనపుడు ఒక్కో విశ్వమానవుడూ తనలోనే అనుకుంటాడు "విశ్వమానవుడు జనించేదెప్పుడు?" అని. అది విన్నవాళ్లలో కొందరు "ఔను, ఎప్పుడు?" అని ఆలోచిస్తారు.

Anonymous said...

వివిధ మానవ జాతుల అసంతృప్తిని చల్లార్చే మార్గం ఆలోచించకుండా "విశ్వమానవులు వంకాయ" అని మాట్లాడ్డం వృథా. ప్రపంచంలో భౌగోళిక దూరాలున్నంత కాలం మనుషుల మధ్య తేడాలుండి తీరతాయి.వాటిని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక మార్గం - ఏ జాతికి ఏవర్గానికి ఇవ్వాల్సిన గౌరవం వారికి బేషరతుగా ఇవ్వడం.అది చెయ్యకుండా ఇంకేదో మాట్లాడ్డం అసలు సమస్యల్ని తప్పుదోవ పట్టించడం.కట్టుకున్న పెళ్ళాం వంక ఫ్రెండు సాభిప్రాయంగా చూస్తేనే భరించలేనివాళ్ళం మనం.మన అబ్బాయిని పక్కింటాయన ఓ దెబ్బ వేస్తే జీవితాంతం కక్షపెట్టుకునేవాళ్ళం మనం.అలాంటి మనం భాష, మతం, రంగు, దేశం లాంటి దైవదత్త భేదాల్ని అధిగమించేంతవాళ్ళమా ? ఔరా !ఆదర్శాలక్కూడా ఓ హద్దుంది.అసంభవాల గురించి మాట్లాడనంతవరకే మనం మేధావుల మనిపించుకుంటాం.

Dr.Pen said...

అంబానాథ్ గారూ,
ఇది ఓ కవిత.అది మొదట గుర్తుపెట్టుకోండి.తరువాత సంగతి ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేస్తూన్నారంటూ ఒక పక్క బాధపడుతూనే, భారతదేశాన్నుంచి విడివడి ప్రత్యేక దేశంగా చూడాలనుకొనే మీ లాంటి వారికి ఈ చురక. ఆదర్శాలకు, ఆశలకు అంతు అనేది ఉండదు. అది మన మీద ఆధారపడిఉంటుంది. ఇక్కడి నల్లవారు దాస్యశృంకలాలలో నలుగుతున్నప్పుడు మీలాంటి పదుగురు ఇదేమాటన్నారు వారి స్యాతంత్ర్యం అసంభవం అని. ప్రపంచంలో భౌగోళిక దూరాలు ఇప్పుడు కుంచించికు పోతున్నాయి, ప్రపంచానిప్పుడు గ్లోబల్ విలేజి అంటున్నారు.కాస్త గమనించండి!